MALLIKARJUN KHARGE | ద్వివేది, త్రివేది, చతుర్వేది పేర్లతో నాకు కన్ఫ్యూజన్‌.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఖర్గే

Mallikarjun Kharge | రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తన చమత్కారమైన మాటలతో సభలో నవ్వులు పూయించాడు. ధన్యవాద తీర్మానంపై ఖర్గే మాట్లాడుతుండగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్‌కఢ్‌కు, ఖర్గేకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

ఖర్గే మాట్లాడుతూ ‘నాకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయని, అందుకే ఎక్కువ సేపు నిలబడి మాట్లాడలేకపోతున్నానని అన్నాడు.’ దాంతో ‘మీరుఎక్కువ సేపు నిలబడలేకపోతే కూర్చుని మాట్లాడవచ్చు’ అని చైర్మన్ ధన్‌కఢ్‌ బదులిచ్చారు. దాంతో కేవలం చైర్మన్‌ అనుమతిస్తేనే తాను కూర్చుంటానని ఖర్గే అన్నారు. అందుకు బదులుగా ‘మీరు సభ లోపలగానీ, బయటగానీ ఎలా సౌకర్యంగా ఉంటే అలా మాట్లాడవచ్చని’ ధన్‌కడ్‌ చెప్పారు.

దాంతో ‘అయినా కూర్చుని మాట్లాడితే నిలబడి మాట్లాడినంత ఉద్రేకం ఉండదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖర్గే, ధన్‌కఢ్‌తోపాటు మిగతా సభ్యులంగా గట్టిగా నవ్వారు. ఆ తర్వాత ‘ఈ విషయంలో నేను సాయం చేస్తా’ అని ధన్‌ఖఢ్‌ చెప్పగా.. ‘మీరు సాయం చేస్తారు. మాకు గుర్తుంది కూడా’ అని ఖర్గే బదులిచ్చారు. దాంతో చైర్మన్‌ నవ్వారు.

అనంతరం తనకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చిన చైర్మన్‌కు కృతజ్ఞతలు అంటూ ఖర్గే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దాంతో సాటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు. దాంతో ‘వీళ్లంతా ఎందుకు నవ్వుతున్నారు..?’ అని ఖర్గే ప్రశ్నించారు. ఆ వెంటనే ‘వీళ్లంతా నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దాంతో సభలో మళ్లీ నవ్వలు విరబూశాయి. ఈ సందర్భంగా సోనియాగాంధీ కూడా ముసిముసి నవ్వులు నవ్వారు.

అనంతరం ఖర్గే ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘చైర్మన్‌ కూడా నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అన్నారు. దాంతో చైర్మన్‌ దన్‌కఢ్‌ నవ్వుతూ.. ‘మేం ఈ వ్యాఖ్యలను డిలీట్‌ చేస్తాం’ అన్నారు. దాంతో ఈసారి నవ్వడం ఖర్గే వంతయ్యింది. మళ్లీ ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. ‘నేను ద్వివేది, త్రివేది, చతుర్వేది పేర్లతో అప్పుడప్పుడు కన్ఫ్యూజ్‌ అవుతుంటా’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.

దానికి చైర్మన్‌ ధన్‌కఢ్‌ బదులిస్తూ.. ‘మీరు కావాలంటే ఈ విషయంలో ఒక అరగంట చర్చ పెట్టుకుందాం’ అన్నారు. ఆ తర్వాత ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ గొప్పలకే సరిపోయిందని విమర్శించారు.

2024-07-01T11:15:49Z dg43tfdfdgfd