'సింగం' సినిమా రిపీట్.. ఇంటర్నేషనల్‌ సైబర్ రాకెట్‌ గుట్టు రట్టు చేసిన సిరిసిల్ల పోలీసులు

తమిళ్ హీరో సూర్య నటించిన సింగం సినిమాలోని సన్నివేశాన్ని సిరిసిల్ల పోలీసులు రిపీట్ చేశారు. జిల్లాకు చెందిన ఓ బాధితుని తల్లి ఇచ్చిన ఒక్క ఫిర్యాదుతో ఇంటర్నేషనల్ లెవల్‌లో అతిపెద్ద సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు. కంబోడియా దేశంలో ఓ చైనీస్ కంపెనీ ద్వారా సైబర్ మోసాలు చేపిస్తున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు బయటపెట్టారు. కండోబియాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడి స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించి.. ఆ కూపంలో ఇరుక్కుపోయిన బాధితుడిని కాపాడి స్వదేశానికి తీసుకొస్తున్నారు.

అయితే.. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి నాలుగు రోజుల క్రితం పెద్దూర్ గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ అనే మహిళ వచ్చి ఫిర్యాదు ఇచ్చింది. జగిత్యాల జిల్లా కోడిమ్యాలకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్‌కి లక్షా 40 వేలు ఇచ్చి తన కుమారుడు శివ ప్రసాద్ కంబోడియా దేశానికి వెళ్లాడని వివరించింది. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత అతన్ని పాస్ పోర్టు లాగేసుకుని, మళ్లీ తిరిగి ఇండియాకు రాకుండా చేసి.. సైబర్ మోసాలు చేపిస్తున్నారంటూ చెప్పినట్టు పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకుంది.

కాగా.. శివ ప్రసాద్ మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సప్ ద్వారా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడగా.. అక్కడ చైనీస్‌కి చెందిన కంపెనీలో శివప్రసాద్ పాస్‌పోస్ట్ తీసేసుకుని సైబర్ నేరాలు చేపిస్తున్నారని.. తనలా అక్కడ ఇండియాకు చెందిన 500 నుంచి 600 మంది బాధితులు ఉన్నారని తెలిపాడు. వాళ్లందరితో కాల్ సెంటర్‌లా ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నెంబర్స్ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, టాస్కులు ఇచ్చి వాటిని పూర్తి చేస్తే అధికమొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్ మోసాలు చేయిస్తున్నారని వివరించారు.

దీంతో.. వెంటనే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుని వివరాలు షేర్ చేశామని.. అక్కడి లోకల్ పోలీస్‌ల సహాయంతో ఆ ఆఫీసుపై దాడులు జరపగా.. అసలు విషయం బయటపడిందని తెలిపారు. దీంతో.. అందులో ఇరుక్కుపోయిన శివప్రసాద్‌ను కాపాడామని.. శివప్రసాద్ 2 రోజుల్లో ఇండియాకు చేరుకుంటారని తెలిపారు. అదేవిధంగా అక్కడ ఉన్న బాధితులని కాపాడి ఇండియాకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే శివప్రసాద్‌ను కంబోడియాకు పంపించిన ఏజెంట్.. జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయిప్రసాద్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. కాగా.. 10,000 రూపాయలు కమిషన్ తీసుకొని మిగతా డబ్బులను లక్నోకు చెందిన సదాకత్ అనే వ్యక్తికి పంపగా.. అతను ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉంటున్నట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇంకొంత డబ్బు.. పూణేలో ఉన్న అబిద్ ఆన్సరీకి పంపగా వీరి వెనుక ఉన్న బీహార్ రాష్టానికి చెందిన ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న షాదబ్ అనే వ్యక్తికి పంపుతారని తెలిపారు. అప్పుడు.. ఆ వ్యక్తులను కంబోడియాకు షాదాబ్ పంపిస్తాడని వివరించారు. వీరిలో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్‌ని.. పూణేలో ఉన్న అబిద్ ఆన్సరీని అదుపులోకి తీసుకున్నామని.. మిగతా ఇద్దరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సైబర్ సెక్యూరి సహాయంతో ఈ కేసును ఛేదిస్తామన్నారు.

ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులు.. కేవలం లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలో ఎవరైతే ఏజెన్సీల ద్వారా గానీ, ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌‌ ఫోన్ నెంబర్ 8712656411కు నేరుగా ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T11:32:11Z dg43tfdfdgfd