ముంబై : ముంబై సమీపంలోని లోనావాలాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కొండలపై ఉన్న జలపాతం(Waterfall)లోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మిగితా వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరు మాత్రం ఈదుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది.
వార్షాకాలం కావడంతో.. లోనావాలాకు భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అయితే భుషి డ్యామ్ బ్యాక్వాటర్ వద్దకు పిక్నిక్ కోసం కొందరు వెళ్లారు. ఉదయం నుంచి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో డ్యామ్ ఓవర్ ఫ్లో అయ్యింది. అకస్మాత్తుగా జలపాతం తీవ్ర స్థాయిలో ఉప్పొంగింది.
జలపాతం మధ్యలో ఉన్న ఏడు మంది కుటుంబం .. నీటి ప్రవాహం పెరగడంతో ఆందోళనకు గురయ్యారు. ఒకర్ని ఒకరు పట్టుకున్నారు. శరవేగంగా వస్తున్న నీటి మధ్యలోనే భయంతో గుంపుగా ఉండిపోయారు. దూసుకువస్తున్న నీటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ క్షణాల్లోనే నీరు ఉదృతరూపం దాల్చింది. ఆ బలమైన ప్రవాహానికి ఏడు మంది ఒకేసారి కొండల మీద నుంచి కిందకు కొట్టకుపోయారు.
కాపాడండి అంటూ వాళ్లు అరుస్తున్నా.. అక్కడే ఉన్న మిగితా టూరిస్టులు కూడా ఏమీ చేయలేకపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా.. వాళ్ల సమీపానికి ఎవరూ వెళ్లలేకపోయారు. ఘటనకు గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు. తాళ్లు, ట్రెక్కింగ్ సామాగ్రితో మిస్సైన వారి కోసం వెతుకులాట ప్రారంభించారు.