హైదరాబాద్​లో రూ.74 లక్షల విలువైన డ్రగ్స్​పట్టివేత

హైదరాబాద్​లో రూ.74 లక్షల విలువైన డ్రగ్స్​పట్టివేత 

శంషాబాద్, వెలుగు : హెరాయిన్​ను బెల్లం పాకంలో మరిగించి ఉండలుగా చేసి ఒక్కొక్కటిగా అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  618 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ రూరల్ సీఐ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన అంబాలాల్ సుతార్ (54) అనే వ్యాపారి మూడేండ్ల కింద శంషాబాద్ వచ్చి ఊట్​పల్లి లోని ఒకరి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తనను తాను బిజినెస్​మ్యాన్​గా చెప్పుకుని తిరిగేవాడు.  అంబాలాల్ డ్రగ్స్​అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో పోలీసులు ఆదివారం రాత్రి అతడు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేశారు. అయితే, డబ్బాల్లో ఉండలుగా ఉన్న పదార్థం కనబడడంతో ఏమిటో కనుక్కోలేకపోయారు.

అన్నీ కలిపి వెయిట్​చూడగా 618 గ్రాముల వరకూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి టెస్టింగ్ కోసం ల్యాబ్​కు పంపగా హెరాయిన్​గా తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. హెరాయిన్ డైరెక్ట్​గా ఇంట్లో పెట్టుకుంటే పట్టుకుంటారని బెల్లం పాకంలో వేసి మరిగించినట్టు చెప్పారు. తర్వాత దాన్ని చిన్నచిన్న ఉండలుగా చుట్టి డబ్బాల్లో నిల్వ చేసి రోజుకొకటి చొప్పున అమ్ముతున్నట్టు చెప్పాడు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ.74 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-06-30T03:47:00Z dg43tfdfdgfd