PAWAN KALYAN: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ

Pawan Kalyan Letter to Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వాలని పవన్ కోరారు. అసెంబ్లీలో వీరికి విప్ పదవులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అసెంబ్లీలో వీరు ఇద్దరిని విప్‌లుగా నియమించాలని లేఖలో పవన్ కళ్యాణ్ కోరారు. అయితే, జనసేనకు రెండు విప్ పదవులు ఇవ్వనున్నందున ఏ ఇద్దరు నేతలకు ఈ పదవులు ఇవ్వాలో జనసేన పార్టీని గతంలోనే కోరినట్లు తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్‌ లను విప్‌ పదవుల కోసం పార్టీ ప్రతిపాదించింది. జనసేన లేఖకు చంద్రబాబు ఓకే చెప్పనున్నారు.

బొమ్మడి నాయకర్ జనసేన అభ్యర్థిగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి తొలిసారి గెలిచారు. అరవ శ్రీధర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి జనసేన పార్టీ తరఫున తొలిసారి గెలిచారు. ఇద్దరు కొత్తవారికి విప్ పదవులకు పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే.. మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. 

మరోవైపు, టీడీపీ నేతల్లో విప్ పదవులకు ఎవర్ని ఎంపిక చేస్తారన్నది కూడా ఆసక్తిగా ఉంది. టీడీపీ నుంచి ఇంకా ఏ నేత పేరు విప్ పదవులకు ప్రకటించలేదు. చీఫ్ విప్ రేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు వినిపిస్తోంది. ఆయనకు మంత్రి వస్తుందని భావించినా.. సామాజిక సమీకరణాలు, పొత్తు కారణంగా దక్కలేదు. 

ప్రస్తుతం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఆ నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

2024-07-01T09:56:38Z dg43tfdfdgfd