ఏళ్ళకు ఏళ్లుగా పెళ్లి కావట్లేదా.. ఇక్కడ అభిషేకం నిర్వహిస్తే మీ ఇంట బాజాభజంత్రీలు మోగుతాయట
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి సైతం శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయాన్ని పోలినట్లు ఉండడం గమనించవచ్చు..చెంబుడు నీళ్లు పోస్తే చాలు కోరిన కోర్కేలు తీర్చే భోళాశంకరుడు… ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడకు వచ్చి..భక్తి శ్రద్ధలతో ఆ కేదారేశ్వరుని పూజిస్తే వారికి వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి. అందుకే పెళ్లికాని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఈశ్వరుడిని దర్శించుకుంటారట . కేదారేశ్వరస్వామి (కుమ్మరి గుడి) దేవాలయం..ఈ స్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని, భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు అప్పాల భీమా శంకర శర్మ తెలిపారు. ఆలయ పూర్తి వివరాల లోకి వెళితే ... మన దేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. మన దేశంలో ఉన్న ప్రతి ప్రసిద్ధ దేవాలయానికి ఓ చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్ఠత ఉంటాయి. అలాగే, ఈ కేదారేశ్వరస్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామివారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో చూద్దాం…రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయం జైనుల కాలం నాటిదని…ఆ దేవాలయంపై దర్శనమిస్తున్న రాతి శిల్ప కళ చెప్పకనే చెబుతోంది. చాళుక్య రాజులు దీనిని కట్టించారు. ఈ ఆలయంలో లింగరూపేడైన కేదారేశ్వర స్వామి వారి లింగంపై బ్రహ్మ సూక్తం ఉంటుందని, అతి ప్రాచీన శివలింగాలపై మాత్రమే ఈ బ్రహ్మ సూక్తం ఉంటుందని అర్చక స్వాములు చెబుతున్నారు. కేదారేశ్వర ఆలయ మతి పురాతనమైన ఆలయమని, ఆలయ రాతి గోడలపై అనేక రకాల దివ్యమూర్తుల ప్రతిమలు చెక్కారు. ఈ ప్రతిమలు కళానైపుణ్యం చూస్తుంటే అబ్బురపడాల్సిందే. ఆలయం మొత్తం వివిధ దేవతామూర్తులతో కనివిందు చేస్తుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న అతి పురాతన విగ్రహాలు చూస్తే జైనుల శిల్ప కళ మనకు దర్శనమిస్తోంది. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాతితో చెక్కబడిన శిలాశాసనం కనువిందు చేస్తుంది. ఈ శాసనంపై శివలింగం, నంది, గోమాతలతో కలిగిన శాసనం ఉంది. స్వామివారి ఆలయానికి ఉత్తరాన విష్ణుమూర్తి, దక్షిణాన బ్రహ్మదేవుని విగ్రహాలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ఆలయ గోపురంపై దేవ దేవుళ్ళ విగ్రహాలు, రథ చక్రాలు, నటరాజ విగ్రహం, నంది, అమ్మవార్ల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ ఆవరణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం విశేషం. స్వామివారిని ప్రతిరోజు అధిక సంఖ్యలో స్థానిక భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ దేవాలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు గతంలో ఈ ఆలయం తెలియకపోవడంతో భక్తుల తాకిడి తక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం భక్తులకు తెలిసేలా స్థానిక ప్రజలు హిందూ సంఘాలు ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నారు. మహా శివరాత్రి రోజు స్థానిక భక్తులు కేదారేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
2024-04-27T10:13:46Z